||సుందరకాండ ||

||అరువది ఆరవ సర్గ తెలుగులో||


||ఓమ్ తత్ సత్||
శ్లో|| ఏవముక్తో హనుమతా రామో దశరథాత్మజః|
తం మణిం హృదయే కృత్వా ప్రరురోద సలక్ష్మణః||1||
స|| హనుమతా ఏవం ఉక్తః రామః దశరథాత్మజః స లక్ష్మణః తం మణిం హృదయే కృత్వా ప్రరురోద||
తా|| హనుమంతునిచేత ఈ విధముగా చెప్పబడిన దశరథాత్మజుడైన రాముడు, లక్ష్మణునితో కలిసి, ఆ మణిని హృదయమునకు హత్తుకొని విలపించెను.
||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ షట్షష్టితమస్సర్గః||

హనుమంతునిచేత ఈ విధముగా చెప్పబడిన దశరథాత్మజుడైన రాముడు లక్ష్మణునితో కలిసి ఆ మణిని హృదయమునకు హత్తుకొని విలపించెను. అ శ్రేష్ఠమైన మణిని చూచి శోకములో మునిగినవాడై నీళ్ళతో నిండిన కళ్ళతో సుగ్రీవునితో ఇట్లు పలికెను.
' ఏవిధముగా ధేనువు తన దూడను చూడగానే వాత్సల్యముతో క్షీరమును ద్రవించునో ఆ విధముగా ఈ మణిరత్నమును చూచి నాహృదయము ద్రవించుచున్నది. ఈ మణి రత్నమును విదేహమహరాజు అయిన నా మామగారిచేత సీతకు ఇవ్వబడినది. వివాహ సమయములో అది సీత తలపై ధరించబడినపుడు అత్యధికముగా శోభించెను. జలమునుంచి ఉద్భవించిన ఈ మణి సజ్జనులచే పూజింపబడినది. ఒక యజ్ఞములో ఆనందభరితుడైన ఇంద్రుని చేత ఇవ్వబడినది. ఓ సౌమ్యుడా ! ఇప్పుడు ఈ శ్రేష్ఠమైన మణి ని చూచి తండిగారి దర్శనము ఆలాగే పూజ్యుడైన విదేహమహరాజును చూచినట్లు అనిపించుచున్నది. ఈ మణి నాప్రియురాలైన సీత శిరస్సునందే శోభించును. దీనిని ఇప్పుడు చూచి నేను ఆమెను పొందితినా అని అనిపించుచున్నది'.

'ఓ హనుమా, దప్పికగలవానికి నీరులాగ వైదేహి వాక్యములను వినిపించుము. సీత ఏమి అన్నది మళ్ళీ మళ్ళీ చెప్పుము. ఓ సౌమిత్రీ ! వైదేహి లేకుండా ఈ నీటిలో పుట్టిన మణిని చూచుటకన్నా దుఃఖము కలిగించునది ఏమి? ఓ సౌమ్యుడా !హనుమా ! వైదేహి ఒక మాసము జీవించినచో చిరకాలము జీవించును. నల్లని కనులు గల సీత లేకుండా నేను ఒక క్షణము కూడా జీవించలేను. ఏక్కడ నా ప్రియురాలు ఉన్నదో ఆ దేశమునకు నన్ను తీసుకొని పొమ్ము. ఆమె పరిస్థితి తెలిసిన తరువాత ఓక క్షణము కూడా నిలువజాలము. ఆ సుందరాంగీ, భయపడునదీ అగు సీత, భయంకరులైన ఘోరముగా వుండు రాక్షసులమధ్యలో ఏట్లు ఉండును? శరత్కాలచంద్రబింబము లాంటి ఆమె వదనము నీటితో నిండిన మేఘములతో కప్పబడిన చంద్రునివలె రాక్షసులచేత చుట్టబడి ప్రకాశించదు.'

'ఓ హనుమా ! ఇప్పుడు సీత ఏమి చెప్పినదో యథా తథముగా చెప్పుము. ఆ మాటలతో ఔషధము సేవించినవాని వలె జీవించెదను. మధురమైన మధురముగా మాట్లాడు స్త్రీరత్నము నా వియోగములో నున్న నాభామిని ఏమి చెప్పెను?. చెప్పుము'.

ఈ విధముగా వాల్మీకి రామాయణములో సుందరకాండలో అరువది ఆరవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||
శ్లో|| మధురా మధురాలాపా కి మాహ మమ భామినీ|
మద్విహీనా వరారోహా హనుమన్ కథయస్వ మే||15||
స|| మథురా మథురాలాపా వరారోహా మత్ విహీనా మమభామినీ కిం ఆహ | కథయస్వ|
తా|| 'మధురమైన మధురముగా మాట్లాడు స్త్రీరత్నము నా వియోగములో నున్న నా భామిని ఏమి చెప్పెను?. చెప్పుము'.
||ఓమ్ తత్ సత్||